కాశీలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన స్వస్తిక్ చిహ్నాలు.. సర్వే నిలిపివేత

  • మసీదు వెలుపల గుర్తించిన సర్వే బృందం
  • అవి ప్రాచీన కాలం నాటివన్న అభిప్రాయం
  • అడ్డుకున్న మసీదు నిర్వహణ కమిటీ, ముస్లింలు
  • వీడియో తీయకుండానే వెనుదిరిగిన బృందం
కాశీలో ప్రఖ్యాత కాశ్వీ విశ్వనాథుని ఆలయానికి ఆనుకునే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే అర్ధంతరంగా నిలిచిపోయింది. కోర్టు నియమించిన కమిషనర్, లాయర్ల బృందం శుక్ర, శనివారాల్లో పరిశీలన సర్వే తలపెట్టింది. ఈ సందర్భంగా మసీదు ఆవరణలో, జ్ఞానవాపి-శృంగార్ గౌరీ క్లాంప్లెక్స్ వద్ద ప్రాచీన కాలం నాటి రెండు స్వస్తిక్ గుర్తులు బయటపడ్డాయి. అవి బాగా రంగు మారిపోయి ఉన్నట్టు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు వీడియో తీసే ప్రయత్నం చేయగా.. శనివారం మసీదు నిర్వహణ కమిటీ, ముస్లింల నుంచి నిరసన, ఆందోళనలు వ్యక్తం కావడంతో కార్యక్రమం మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. 

పురాతన కాలంలోనే ఈ స్వస్తిక్ గుర్తులను గీసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మసీదు ఆవరణలో సర్వేను వీడియో తీయాలన్న ప్రయత్నం చేయగా ఫలించలేదు. మసీదు లోపలికి కూడా వారిని అనుమతించలేదు. ఓ పిటిషన్ పై విచారణలో భాగంగా వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు సర్వేకు ఆదేశించడం గమనార్హం. దీంతో శుక్రవారం న్యాయవాదులు, కమిషనర్ బృందం పరిశీలన చేపట్టింది. మసీదు వెలుపలి గోడలపై హిందూ దేవతల రూపాలు ఉన్నాయని, పూర్వం అది హిందూ ఆలయమేనంటూ కొందరు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. 

వేరే కోర్టు నియమించే కమిషనర్ ఆధ్వర్యంలో సర్వే చేస్తే తమకు అభ్యంతరం లేదంటూ మసీదు నిర్వహణ కమిటీ వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై తేలే వరకు సర్వే నిలిచిపోయినట్టేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Varanasi
kasi
Gyanvapi mosque
swastikas

More Telugu News